Tuesday 1 November 2011

చరిత మరువకు భవిత!


నేను వ్రాసి పంపిన కథ చరిత మరువకు భవిత! స్వప్న మాస పత్రిక నిర్వహించిన కథల పోటీలో మూడవ బహుమతి గెలుచుకున్నది. బ్లాగర్లు కూడా ఈ కథను చదివి తమ అభిప్రాయం తెలుపగలరని ఆశిస్తున్నాను.

మయం తొమ్మిది కావస్తోంది. ప్రతి ఒక్కరు వెనక ఎవరో తరుముతున్నట్టు పరిగెడుతున్నారు.

టాంక్ బండ్ ఫై త్యాగయ్య, రామదాసు విగ్రహాల మద్య కుటుంబముతొ సహా కూర్చున్న మల్లయ్య చాలా దిగాలుగా ఉన్నాడు. ఈ రణగొణ ధ్వనులు మరింత చికాకును కలిగిస్తున్నాయతనికి. మల్లయ్య వ్యవసాయ కూలి. అతని పెళ్ళాం కూడా కూలీనే. రెండేళ్ళుగా వానలు లేక వూరు కరువుబారిన పడింది. వాళ్ళవూరే కాదు చుట్టపక్కల వూళ్ళ పరిస్థితి కూడా అదే. ఊళ్ళల్లో పనులు లేక బ్రతుకుతెరువు కోసం అందరూ వలసల బాట పట్టారు.

మల్లయ్య నగరానికి వచ్చి రెండు రోజులైంది. భద్రయ్య జాడ తెలిసికోలేక పోతున్నాడు. వాళ్లిద్దరిది ఒకే వూరు. రెండేళ్ళ క్రితమే భద్రయ్య పెళ్ళాం పిల్లలతో వలస వచ్చాడు. మొదట్లో రోజు కూలిగా పనిచేస్తూ అక్కడే వాచ్ మాన్ గా కుదిరాడు. అతన్ని నమ్మి ఏదో ఒక పని కుదర్చక పోతాడా అని నగరానికి వచ్చాడు మల్లయ్య. కాని భద్రయ్య పనిచేసే భవంతి నిర్మాణం పోయిన నెలలోనే పూర్తయి అది ఒక ప్రయివేటు కంపెనీ ఆధీనంలోకి వచ్చిందని, భద్రయ్య గురించి తనకేమి తెలీదని ఇప్పుడు అక్కడ పని చేస్తున్న సెక్యురిటి గార్డ్ చెప్పాడు. నగరంలో భద్రయ్య తప్ప ఇంకొకరు తెలీదు. ఇప్పడు ఎటు పోవాలో, ఏమిచేయాలో దిక్కుతోచడం లేదతనికి.

“నాయనా! ఇప్పుడేమి చేద్దాం? తిరిగి మన వూరికి పోదామా?” అని అడిగాడు కొడుకు గణేష్. తిరిగి వూరెళ్తే మద్యలో వదలేసి వచ్చిన చదువును కొనసాగించ వచ్చని వాడి ఆలోచన.

“ఇంక వూరికి పోయేది లేదు. కనీసం ఒక ఏడన్నా ఇక్కడే ఏదో ఒక పనిచేసుకొని బ్రతకాలి. వచ్చే ఏడన్నా వూళ్ళో మంచి వానలు పడితే అప్పుడు ఆలోచిస్తాము” అన్నాడు మల్లయ్య.

నిరాశగా తలమరల్చి ఎదురుగా కనపడుతున్న తథాగతున్ని చూస్తూండి పోయాడు గణేష్.

ఇంతలో ఉన్నట్టుండి అక్కడ అలజడి మొదలైంది. ఒకటోకటిగా ప్రభత్వ వాహనాలు వచ్చి ఆగాయి. ఓ గంట సేపు అధికారులు తమలో తాము చర్చించికున్నారు. చివరలో మీడియాకి ఇంటర్వులు ఇచ్చి వెళ్లిపోయారు. దూరంగా కూర్చొని ఇదంతా గమనిస్తున్న మల్లయ్యకు, అతని కుటుంబానికి ఏమీ అర్థమవలేదు.

అందరూ వెళ్ళాక అక్కడ మిగిలివున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి,“ “సారూ! ఏంటి ఈ అడావుడి?” అడిగాడు మల్లయ్య.
అతడు ఆ చుట్టుప్రక్కల మునిసిపాలిటి పనుల పర్యవేక్షణ అధికారి యాదగిరి.

మల్లయ్యని ఎగాదిగా చూస్తూ, "అక్కడ ఉన్న బొమ్మ ఎవరిదో తెలుసా”? అడిగాడు.


అతను చూపించిన విగ్రహం వైపు చూస్తూ తెలీదన్నాడు మల్లయ్య.

నాకు తెలుసు, అది విజయనగర చక్రవర్తి “శ్రీకృష్ణదేవరాయలు” చెప్పాడు గణేష్.

“కరేక్ట్. “అతడు రాజయ్యి ఐదు వందల సంవత్సరాలు అయ్యిందట. రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతోంది. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పది రోజుల్లో టాంక్ బండ్ మొత్తం కళకళలాడాలట. విదేశీయులు కూడా వస్తున్నారట. ఏర్పాట్లు బ్రంహాడంగా వుండాలని ఆదేశించి వెళ్లారు” చెప్పాడు యాదగిరి.

కాని యాదగిరికి ఆందోళనగా వుంది. తనక్రింద పనిచేసే ఆడవాళ్ళు ఇద్దరు తమ వ్యక్తిగత కారణాలవల్ల నెలరోజులపాటు పనికి రామని చెప్పారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ఉత్సవం వచ్చి పడింది. ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నాడు.

“సారూ! మాకిక్కడ ఏదన్న పని దొరుకుతుందా?” అడిగాడు మల్లయ్య. సమాధానం వచ్చేలోపే తమ కథంతా చెప్పి దయచేసి ఏదన్న పని ఇప్పించమని వేడుకొన్నాడు.

“సరే! ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఓ వారం రోజుల పనివుంది టాంక్ బండ్ ఈ చివరి నుండి ఆ చివర వరకు పూలచెట్ల పొదలను, వాటి పాదులను సరిచేయాలి. మరియు గడ్డిని సమాంతరంగా కత్తిరించాలి. ఇంకా చిన్న చిన్న పనులు చేయాలిమరి. చేస్తావా?” అడిగాడు యాదగిరి.

“అదెంత పనిసారూ. మాకు తెలిసింది అదే కదా. పని ఇప్పించండి మీరు వూయిందాని కంటే బాగా చేసి చూపిస్తాము” బదులిచ్చాడు మల్లయ్య.

“సరే, ఈరోజు నుండి పని మొదలెట్టండి. కావలిసిన పనిమూట్లు పంపిస్తాను. కాని పైసలు పనైన తరువాతే ఇస్తాము.

“అట్లాగే కాని సారూ” అంటూ దండం పెట్టాడు మల్లయ్య.

“మరి మీరుండేది ఎక్కడ?’ ప్రశ్నించాడు యాదగిరి. ఏమి చెప్పాలో తెలీయలేదు మల్లయ్యకి.

“సరే .. ఇక్కడే దగ్గర్లో బస్తీ ఉంది. ఏదో ఒక ఏర్పాటు చేస్తాన్లే!” అంటూ మోటారుసైకిల్ ఫై వెళ్లిపోయాడు.

కాసేపటి పనిమూట్లు వచ్చాయి. పని మొదలెట్టారు మల్లయ్య మరియు అతని పెళ్ళాం పార్వతి. గణేష్ టాంక్ బండ్ మీదున్న తెలుగు వెలుగుల విగ్రహాలను ఒకటొకటి చూస్తూ, వాటిలో తనకు తెలిసిన వారు, వారి గురించి చదువుకున్న, ఉపాద్యాయులు చెప్పిన విషయాలను గుర్తుచేసికొంటున్నాడు.

సాయంత్రం అయ్యింది. యాదగిరి వచ్చి బస్తీలో వారి వసతి గురించి చెప్పాడు. “చాల సంతోషం సారూ. మీ మేలు ఎప్పటికి మరిచిపోము” అంటూ కృతజ్ఞత నిండిన మనసుతో చెప్పాడు మల్లయ్య.

గణేష్ రామదాసు విగ్రహం ముందు నిల్చొని ఆయన గురించి తను చదువుకున్న సంగతులను మననం చేసికుంటున్నాడు. ఇంతలో విగ్రహం వెనుకవైపు నుంచి చిన్నగా ఏడుపు వినిపించిందతనికి. వెళ్లి చూసాడు. అక్కడ ఓ అబ్బాయి ఏడుస్తూ కనిపించాడు. దొరబాబు లాగున్నాడు. మరి ఎందుకు ఏడుస్తున్నాడో! అడుగుదామా, వద్దా అని తటపటాయించాడు. చివరకు అడిగాడు ఏమైందని. కళ్ళు తుడుచుకున్నాడే కాని సమాధానం లేదు.

కాసేపైన తరువాత గణేష్ అతని ప్రక్కన కూర్చొంటూ, నీ పేరేమిని అడిగాడు.

“కార్తీక్” సమాధానం ఇచ్చాడు.

“ఎందుకు ఏడుస్తున్నావు?”

సమాధానం లేదు.

“కాసేపు నేను నీ ఫ్రెండు అనుకో. మరి ఫ్రెండు దగ్గర ఏమీ దాచకూడదు కదా! ఇప్పుడు చెప్పు!” అడిగాడు గణేష్
మళ్ళీ సమాధానం లేదు.

కాసేపు తరువాత తన ప్రక్కలో వున్న బ్యాగు నుంచి ట్రోఫి మరియు మెడల్ తీసి చూపిస్తూ, “ఈరోజు మా స్కూల్లో స్పోర్ట్స్ డే జరిగింది. నాకు “చాంపియన్షిప్” వచ్చింది అన్నాడు కార్తీక్.

“మరి సంతోషమే కదా! ఎందుకేడుస్తున్నావు?”

“కానీ, నేను తీసికొంటుండగా చూడడానికి మా మమ్మి, డాడి రాలేదు. పైగా మా డాడీకి ఈ స్పోర్ట్స్, అన్నా గేమ్స్ అన్న ఇష్టం ఉండదు. టైం వేస్ట్, స్టడీస్ పాడవుతాయి అంటారు.”

“మీ నాన్న, అదే మీ డాడి ఏమిచేస్తుంటారు?’

“డాక్టర్, హార్ట్ స్పెషలిస్ట్” చెప్పాడు కార్తీక్.

“మరి మీ మమ్మి?”

“తను సోషియాలజిస్ట్. పాలిటిక్స్ లో చేరి పెద్ద పేరు తెచ్చుకోవాలనిది ఆమె గోల్.”
“మరెందుకు రాలేదు వాళ్ళు?”

“డాడికేమో సెమినార్ వుందట. ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారట, మమ్మికేమో ఢిల్లీలో మీటింగ్ వుందట” చెప్పాడు కార్తీక్.

“మరి వాళ్ళు రాకపోవడానికి సరైన కారణాలే ఉన్నాయి కదా!”

“వాళ్ళెప్పుడు ఇంతే. ఎప్పుడూ రారు. ఏదో ఒక రీజన్ ఉంటుంది వాళ్లకు చెప్పడానికి”

“అలా ఎందుకనుకొంటావు. వాళ్ళు కష్టపడితేనే కదా నీవు మంచి స్కూల్లో చదవగాలుగుతావు. ఇంతకీ మీ స్కూల్ పేరేమే? నీవు ఏ క్లాస్?”

“ఆక్స్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్”, సెవెంత్ క్లాస్.”

“అంటే! ఏడవ తరగతి. నేను కూడా ఏడవ తరగతే. కానీ మద్యలో ఆపేయాల్సివచ్చింది.”

“ఎందుకు?” ప్రశ్నించాడు కార్తీక్.

“మా వూళ్ళో పనుల్లేక మేమంతా ఇక్కడకి వచ్చేసాము”

అర్థమయి, కానట్టు చూసాడు కార్తీక్.

అంతలో గణేష్ కోసం మల్లయ్య వెతుక్కుంటూ వచ్చాడు. “నాయనా గణేష్!. సారు మనకోసం వసతి చూసాడంట, రా! వెళదాము “అంటూ ప్రక్కనే ఉన్న కార్తీక్ ని చూస్తూ, “ఎవరీ అబ్బాయి?” అడిగాడు.

“మా ఫ్రెండ్ కార్తీక్ నాయన. కార్తీక్ వైపు చూస్తూ “ఇంటికి వెళ్ళు మీ మమ్మి డాడి కంగారు పడతారు”” అన్నాడు గణేష్.

వాళ్ళు వెళుతున్న వైపే చూస్తుండిపోయాడు కార్తీక్. ఇంటికి పోవాలనిపించట్లేదతనికి. ఇంటికి పొతే ఏముంది. బొమ్మకి కీ ఇచ్చినట్టు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు పనివాళ్ళు. నా హ్యపినేస్ ఎవరూ షేర్ చేసుకోరు అనుకుంటూ బాధతో మూలిగాడు.

మళ్ళీ తెల్లారింది. మల్లయ్య తన కుటుంబంతో టాంక్ బండ్ మీద పనికి ఉపక్రమించాడు.

గణేష్ తను ముందు రోజు కార్తీక్ ని కలసిన రామదాసు విగ్రహం దగ్గరకు వచ్చాడు. విగ్రహం వెనుక వైపు పడుకొని వున్న కార్తీక్ ని చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో! అనుకుంటూ తట్టి లేపాడు.

కొద్ది కొద్దిగా కళ్ళు తెరుస్తున్న కార్తీక్ ని, “ఏంటి ఇక్కడే ఉన్నావు? ఇంటికి పోలేదా?” ప్రశ్నించాడు గణేష్
లేదని అడ్డంగా తలూపాడు.

“మీ మమ్మి డాడి నీ కోసం వెతుకుతుంటారు కదా పాపం!”

“వెతకనీ. నా ఫీలింగ్స్ వాళ్లకు పట్టలేదు. నాకు వాళ్ళ ఫీలింగ్స్ అక్కరలేదు.”

“అలా అనకూడదు. రా! ఎక్కడనుంచైనా ఫోన్ చేద్దాం” అంటూ పైకి లాగాడు.

“ఏయ్ వదులు. నీ పని చూసుకో పో!” అంటూ చేయి విదుల్చుకొని తోసాడు.

ఇక బలవంతం చేయకూడదని, “సరే నీ ఇష్టం. కాని ఎమన్నా తిన్నావా అసలు?” అడిగాడు గణేష్.

“నీకెందుకు?” అని నిర్లక్ష్యంగా చూసాడు కార్తీక్.

“నేను నీ ఫ్రెండుని. వుండు ఇప్పుడే వస్తాను” అంటూ వెళ్లి పావు గంట తరువాత వచ్చాడు. “ఇదిగో బిస్కెట్స్, తిను.
ఏమీ తినకపోతే పైత్యం చేస్తుంది” అంటూ ప్యాకెట్ అందించాడు.

కాసేపు బెట్టు చేసినా తరువాత ప్యాకెట్ అందుకొని బిస్కెట్స్ తింటూంటే, “మరి ఇంటికి వెళ్ళనంటున్నావు, ఇప్పుడు ఏమి చేద్దామనుకొంటున్నావు!” అడిగాడు గణేష్.

“ఏమో!” ఎటో చూస్తూ చెప్పాడు . తిన్నాక వాటర్ బాటిల్ లో కొద్దిగా మిగిలి ఉన్న నీళ్ళు తాగాడు. ఇప్పుడు కాస్త స్థిమిత పడ్డాడు.
“థ్యాంక్స్” చెప్పాడు గణేష్ కి.

ఇంతలో ప్రభుత్వ అధికారులు కొంతమందితో వచ్చి, తమతో వచ్చిన వాళ్లకు ఉత్సవ వేదిక గురించి, విద్యుత్దీపాలంకరణ గురించి ఆదేశాలు ఇస్తున్నారు. దీనిని ఆసక్తిగా గమనిస్తున్నాడు గణేష్. వాళ్ళ వూర్లో కూడా తిరునాళ్ళు, జాతర జరిగేటప్పుడు ఇలాంటి ఏర్పాట్లే చేస్తుంటారు. అరగంట హడావుడి చేసి వెళ్లారు.

“ఎవరు వాళ్ళు? ఏమి చెబుతున్నారు?” అడిగాడు కార్తీక్.

“రెండువారాల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. దాని ఏర్పాట్లు చూస్తున్నారు.”

“ఉత్సవాలంటే? “

“ఫంక్షన్ లాంటిది” చెప్పాడు గణేష్.

“ఏమి ఫంక్షన్?”

“శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం జరిగి ఐదువందల సంవత్సరాలయ్యయని”

“శ్రీకృష్ణదేవరాయలా! అయన ఎవరు? పట్టాభిషేకం అంటే?”

“శ్రీకృష్ణదేవరాయలేవరో తెలీదా? “అదిగో ఆ కనిపించే బొమ్మ ఆయనదే”, చూపించాడు గణేష్. మళ్ళి తనే, “పట్టాభిషేకం అంటే రాజవడం”

“అయితే, దానికి ఇదంతా చేయడం ఎందుకు?”

“ఆయన గొప్పతనం గుర్తుచేసుకోవడానికి”

“ఏమి చేసాడు?”

“తెలుగు భాషకు చాలా సేవ చేసాడు. అవునూ! నీవు ఇవన్ని చదువుకోలేదా?” ప్రశ్నించాడు గణేష్

“లేదు. మా సబ్జక్ట్స్ లో ఇవన్ని వుండవు. నాకు తెలుగు తెలీదు. రాయడం రాదు, చదవడం రాదు”

“ఏంటి! తెలుగువాడయుండి తెలుగు తెలీదా? నీకు తెలుసా శ్రీకృష్ణదేవరాయలు అసలుకి తెలుగువాడు కాదు. అయినా తెలుగు నేర్చుకొని తెలుగులో “”ఆముక్తమాల్యద”” అనే గ్రంధం రాసాడు”

“తెలుగువాడు కాకపోయినా తెలుగులో బుక్ రాసాడా? ఓహ్! హి ఈస్ గ్రేట్”.

“అంతేనా! ఆయన గొప్పతనం ఇంకా చాలా వుంది. ఆయనకు మనవాళ్ళు ఇచ్చిన బిరుదు “ఆంధ్రభోజుడు”

“బిరుదంటే?” అడిగాడు కార్తీక్.

“బిరుదంటే.......ఆ ఇప్పుడు మనం చిరంజీవిని “మెగాస్టార్” అని, జూ.ఎన్.టి.ఆర్ ని “యంగ్ టైగర్” అంటాము కదా! అలా అన్నమాట.”

“ఓహ్! ఓకే!” అర్థమయినట్టు తలూపాడు కార్తీక్.

“ఆయన అంత గొప్పవాడు కావడానికి కారకుడు మహామంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు ఆయన్ని “అప్పాజీ” అని పిలిచేవారట. ఆయన కొలువులో “అష్టదిగ్గజాలని” ఎనిమిది మంది కవులు వుండేవారట. ఆ కవులతో “భువనవిజయం” ఏర్పాటు చేశాడట.”

“కవులంటే? “అడిగాడు కార్తీక్

“కవులంటే.. అదే పద్యాలు వ్రాస్తారు”

“యు మీన్ పొయట్రీ?”

‘అయ్యుండొచ్చు. “నాకు ఇంగ్లీష్ రాదు నీకు తెలుగు రాదు. కానీ భలేగా ఫ్రెండ్స్ అయ్యాము” నవ్వుతూ అన్నాడు గణేష్.

“యా! వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్.’

“ఆ కవుల్లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, తెనాలి రామకృష్ణుడు ముఖ్యులు” చెప్పాడు గణేష్

‘ఓ! తెనాలి రామలిం. నేను ఆయన కామిక్స్ చదివాను. చాలా ఫన్నీగా వుంటాయి.”

“అందుకే ఆయన్ని వికటకవి అన్నారు. నీకు తెలుసా ఆయన మేక, తోక మీద పద్యం పడాడు.
మేక తోక మేకతోకకు తోక మేక మేకకోకతోక ...........................................................”

“ఓహ్! ఇట్స్ రియల్లీ ఫన్ని. ఇవన్ని మీ టెక్స్ట్ బుక్స్ లో వున్నాయా?” అడిగాడు కార్తీక్

“అన్నీ లేవు. కానీ మా తెలుగు మాస్టారు పుస్తకాల్లో లేనివి కూడా చెప్పేవారు. ఆయన పాఠం చెబుతుంటే ఓ కథ వింటున్నట్టు వుండేది.” బదులిచ్చాడు గణేష్.

“యూ పీపుల్ రియల్లీ లక్కీ. మాకంతా రొటీన్. జస్ట్ ఓ ప్లేయర్లో సిడినో, క్యాసెటో వింటున్నట్టు వుంటుంది.”

అలా సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకుంటూనే వున్నారు. మద్యలో గణేష్ భోజనాన్నే ఇద్దరూ పంచుకొని తిన్నారు.మాటల మద్యలో కార్తీక్
వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసుకొని తనకి తెలీకుండా వాళ్ళ డాడీకి కార్తీక్ ఎక్కడ ఉన్నది తెలిపాడు.

అలా మాట్లడుకొంటుండగా “కార్తీ!” అంటూ అరుపు వినపడింది.

“డాడీ!” అప్రయత్నంగా పలికాయి కార్తీక్ పెదాలు.

కారు దిగి పరుగున వచ్చి కార్తీక్ ని వాటేసుకున్నారు కార్తీక్ డాడి, డాక్టర్ సుధాకర్, మమ్మి శాంతి.

కాసేపు అలా ఉండి తెరుకున్నాక, “ఎక్కడికెల్లావ్ బస్ దిగి ఇంటికి రాకుండా? నేను మమ్మి ఎంత కంగారు పడ్డామో తెలుసా?” అన్నాడు సుధాకర్.

తలవంచుకున్నాడు కార్తీక్.

“ఏం మాట్లాడవు?” గద్దించాడు వాళ్ళ డాడి.

దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న మల్లయ్య వారి దగ్గరకు వచ్చి, “బాబు భయపడుతున్నాడు. ఇంటికెళ్ళి నెమ్మదిగా అడగండి” అన్నాడు.

సుధాకర్, కార్తీక్ వైపు తిరిగి, “రా! ఇంటికి వెళదాం” అన్నాడు.

“వస్తాను. బట్ ఒన్ కండీషన్. గణేష్ ను కూడా తీసుకెలదామంటేనే!” అన్నాడు కార్తీక్

“నో! “అతనెల మనింట్లో వుంటాడు. అసలికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు”” అంది కార్తీక్ మమ్మి శాంతి.

“అయితే నేను రాను” బెట్టు చేశాడు కార్తీక్.

“అలా అనకూడదు. మమ్మి, డాడి చెప్పినట్టు వినాలి. ఇంటికెళ్ళు అని సముదాయించాడు” గణేష్.

“ప్లీజ్ డాడి! అట్లీస్ట్! డైలీ ఒన్నవరు అన్నా గణేష్ దగ్గరకు పంపిస్తానంటేనే వస్తా!” అన్నాడు కార్తీక్

ఇంక చేసేదేమీలేక “సరే చూద్దాం! పద ఇంటికెళదాము” అన్నారు కార్తీక్ తల్లిదండ్రులు.

“బై గణేష్! వి విల్ బి గుడ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్.” గణేష్ కి బై చెప్పాడు కార్తీక్.

కారు ఎక్కబోతు “ఒన్ మోర్ కండిషన్” అని మళ్ళీ ఆగాడు. ఏమిటన్నట్టు చూసారు సుధాకర్ మరియు శాంతి.
“నెక్స్ట్ వీక్ స్కూల్లో ఆన్యువల్ డే వుంది. మీరు వస్తానంటేనే కారెక్కుతా, లేకపోతే ఇక్కడే వుంటా” అన్నాడు కార్తీక్
“తప్పకుండ వస్తాం. ప్రామిస్! సరేనా! ఇక కారెక్కు” అన్నారు. అందరు కారెక్కరు.

వెళుతున్న కారునే చూస్తుండి పోయాడు గణేష్.

చెప్పినట్టుగానే రోజూ సాయంత్రం పూట గణేష్ దగ్గరకు వచ్చి ఓ గంట కబుర్లు చెప్పుకోవడం, ఆడుకోవడం నిత్యకృత్యం అయ్యింది కార్తీక్ కి.
ఆన్యువల్ డే రానే వచ్చింది. ఆడిటోరియం అంతా తల్లిదండ్రులు, పిల్లలతో నిండిపోయింది. ప్రామిస్ చేసారు గనక కార్తీక్ మమ్మి డాడి కూడా వచ్చారు. కార్తీక్ ప్రొద్దున్నే స్కూల్ కి వచ్చాడు. ఏదీ కనపడడే అని కూర్చున్న చోటు నుంచే కళ్ళతో వెతుకుతున్నారు.

సభ ప్రారంభమయ్యింది. ముఖ్యఅతిథిగా విద్యాశాఖామాత్యులు వచ్చారు. అందరి ప్రసంగం అయిన తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. పాటలు, డ్యాన్సులు, స్కిట్స్ ఒకటొకటిగా జరిగాయి. చివరిగా ఫ్యాన్సి డ్రెస్ కంపెటీషన్ మొదలైంది. దాంతోపాటే కార్తీక్ తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఇప్పటికీ కార్తీక్ జాడ లేదు.

ఇంతలో “లాస్ట్ ఐటెం బై కార్తీక్. హి విల్ పెరఫాం యాస్ “శ్రీకృష్ణదేవరాయ” అని స్పీకర్ లో వినపడింది.

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు కార్తీక్ తల్లితండ్రులు. వాళ్ళ కళ్ళన్నీ వేదికపై కార్తీక్ కోసం వెదక సాగాయి. అసలు తాము విన్నది నిజమేనా అనిపించింది.
ఇంతలో వేదిక మీద ఒక ప్రక్క నుండి గంభీరంగా నడుచుకొంటూ వచ్చాడు శ్రీకృష్ణదేవరాయల వేషధారణలో వున్న కార్తీక్.
వేదిక మద్యలో వున్న మైకు దగ్గర నుల్చుని మొదలెట్టాడు.

“తెలుగుదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగువల్లభుండ తెలుగొకండ
ఎల్లనృపులు కొలువ నెఱుగవే బాసాడి
దేశభాషలందు తెలుగులెస్స”

పద్యానికి తగ్గ హావభావాలతో అభినయిస్తూ ముగించాడు.

ఆడిటోరియం అంతా కళతారధ్వనులతో మారుమ్రోగింది. కార్తీక్ అందరికి తలవంచి నమస్కరిస్తుండగా తెర పడింది.
తమ కళ్ళను తామే నమ్మలేక పోతున్నారు కార్తీక్ తల్లిదండ్రులు.

మంత్రి చేతుల మీదుగా బహుమతి ప్రధానం మొదలైంది. “ఇన్ ఫాన్సీ డ్రెస్ కాంపెటీషన్ ది ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కార్తీక్” “ఏకపాత్రాభినయంలో మొదటి బహుమతి పొందినది కార్తీక్” అని స్పీకర్ లో వినపడింది.

శ్రీకృష్ణదేవరాయల వేషంలో వున్న కార్తీక్ వచ్చి బహుమతి అందుకున్నాడు.

మంత్రి మైక్ తీసుకొని “ “చరిత్రలోని మహానుభావులను, వారి గొప్పతనాన్ని వర్తమానంలో స్మరించుకొంటూ భవిష్యత్తు తరాలకు తెలియజేయాలి. మన భాష, సంస్కృతీ, సాహిత్యాలను కాపాడుకోవాలి. శ్రీకృష్ణదేవరాయలు జనరంజకమైన పాలన చేస్తూ, తెలుగు భాషా,సాహిత్యాలకు ఎనలేని సేవ చేశాడు. అందుకే ఆయనను “”సాహితి సమరాంగణ సార్వభౌముడు”” అన్నారు. ఆయన పట్టాభిషక్తుడై ఐదువందల సంవత్సరలైన ఈ సందర్భంలో ఆయనను స్పురింప చేస్తూ కార్తీక్ చేసిన అభినయం మెచ్చదగినది. మంచి భాష, సంస్కృతీ నేర్పించి, ప్రోత్సాహించిన గురువులకి, తల్లిదండ్రులకి నా అభినందనలు. దయచేసి వారిని వేదిక పైకి రావలసిందిగా కోరుతున్నాను” అంటూ ఆహ్వానించారు.

కార్తీక్ తల్లిదండ్రులు వేదిక మీదకు రాగానే ఆడిటోరియం అంతా మరొక్కసారి కళతారధ్వనులతో మారు మ్రోగింది. ఇద్దరు ఒక్కసారిగా తమ బిడ్డను హృదయానికి హత్తుకొన్నారు.

కారులో ఇంటికి వెళుతుండగా దారి పొడువునా ఒకటే పొగుడుతున్నారు కార్తీక్ ని వాళ్ళ తల్లిదండ్రులు.

“మామ్మి, డాడి, “ఇందులో నాదేమి లేదు. అంతా గణేష్ గొప్ప. ఎందుకంటే ఒక వారం రోజుల ముందు వరకు నాకు శ్రీకృష్ణదేవరాయలంటే ఎవరో తెలీదు. స్కూల్లో చెప్పలేదు. మీరు కూడా చెప్పలేదు. మీకంత టైం కూడా లేదు. మన హిస్టరీ గురించి, మన కల్చర్ గురించి మనమే తెలుసుకోలేకపోతే ఎలా? గణేష్ వలన నాకు చాలా విషయాలు తెలిసాయి. ఈ ప్రైజ్ గణేష్ ది. అతడికే చెందాలి” అని టాంక్ బండ్ మీదుగా వెళుతున్న కారు అద్దాల్లోంచి తెలుగు వెలుగులను చూస్తూ చెప్పాడు కార్తీక్.

-------------------------------------------------- సమాప్తం------------------------------------------------------------------------------------------------

చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా!

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
సాటిలేని జాతి – ఓట మెరుగని కోట
నివురుగప్పి నేడు – నిదురపోతుండాది

జైకొట్టి మెల్కోలుపు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా! || చేయెత్తి ||

వీర రక్తపుధార – వారబోసిన సీమ
పలనాడు నీదెరా – వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్ర పాపయ్య గూడ నీవొడూ! || చేయెత్తి ||

కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల
మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే
వీరవనెతలగన్న తల్లేరా!
ధీరమాతల జన్మభూమేరా! || చేయెత్తి ||

నాగర్జునుడికొండ, అమరావతీ స్థూపం
భావాల పుట్టాలో – జీవకళ పొదిగావు
అల్పుడను కావంచు తెల్పావు నీవు!
శిల్పినని చాటావు దేశదేశాలలో! || చేయెత్తి ||

దేశమంటే మట్టి కాదన్నాడు
మునుషులన్న మాట మరువబోకన్నాడు
అమర కవి గురజాడ నీవాడురా!
ప్రజల కవితను చాటి చూపాడురా! || చేయెత్తి ||

రాయలేలిన సీమ – రతనాల సీమరా
దాయగట్టె పరులు – దారి తీస్తుండారు
నోరెత్తి యడగరా దానోడా!
వారసుడ నీవెరా తెలుగోడా! || చేయెత్తి ||

కల్లోల గౌతమీ – వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రా తల్లి – పోంగిపొరలిన చాలు
ధాన్యరాసులే పండు దేశానా!
కూడు గుడ్డకు కొదవలేదన్నా! || చేయెత్తి ||

ముక్కోటి బలగమోయ్ – ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగులోన – వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతి బిడ్డల పోరు మనకేలా! || చేయెత్తి ||

పెనుగాలి వీచింది – అణగారి పోయింది
నట్టనడి సంద్రాన – నావ నిలుచుండాది
చుక్కాని బట్టారా తెలుగోడా!
నావ దరిజేర్చరా – మొనగాడా! || చేయెత్తి ||



తెలుగువాడినని గర్వించు! తెలుగును బ్రతికించు! 

Saturday 3 September 2011

అందరూ బాగుండాలి!

అందరూ బాగుండాలి
- సురేష్‌కుమార్ పెద్దరాజు
July 25th, 2010 ఈ కథ ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది.



గుడిసె గడప దగ్గర కూర్చొని ఆకాశంవంక దిగాలుగా చూస్తున్నాడు ఈరయ్యగా పిలవబడే ఈశ్వరయ్య. యాటకు వెళ్ళక మూడురోజులైంది. ఇంకా జోరుగా పడుతూనే వుందీ వాన. ఎప్పటికి తెరిపిస్తుందో అనుకొంటూ నిట్టూర్చాడు.
ఈశ్వరయ్య రోజు వేటకు వెళ్ళి ఏట్లో పట్టిన చేపలు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటుంటాడు. అతనికి ఇద్దరు పిల్లలు. కూతురికి పోయిన ఏడాదే పెళ్ళిచేసాడు. అల్లుడు కూడా ప్రక్కూళ్లో చేపల వ్యాపారం చేస్తుంటాడు. కొడుకు వూరి బళ్ళో ఐదవ తరగతి చదువుతున్నాడు.

“ఒసేయ్, గంగి! ఆకలేత్తోంది ఏదన్నా వుంటే పెట్టు” అరిచాడు ఈశ్వరయ్య. పళ్ళెంలో చద్దన్నం పెట్టుకొని కాసిని మజ్జిగ పోసుకొని తెచ్చి అతని ముందుంచింది ఈశ్వరయ్య పెళ్ళాం గంగాభవాని.
“చిన్నయ్య ఏమన్నా తిన్నాడా”? అని కొడుకు గురించి అడిగాడు.

“ఆ తిన్నాడు అంది”. మళ్ళీ తనే ‘బియ్యం ఇంకొక పూటకు వత్తాయి ఈ వానేమో తగ్గదాయే. ఎట్లయ్య’ అడిగింది గంగాభవాని. “అదే ఆలోచిత్తా వుండానే. ఏమి తోయట్లేదు” అన్నాడు ఈశ్వరయ్య.

ఇంతలో, “ఏయ్ ఈరయ్య వాగు మంచి పొంగుమీదుంది, రాదారి మీదుగా పారుతోందట. వూళ్ళోకి వచ్చే బళ్ళు, పోయే బళ్ళు యింటికాడ నిల్చిపోయాయంట తెలుసా!” అంటూ అరిచాడు. ఎదుటి గుడిసెలో వుండే వెంకటయ్య.
“అయ్యో! అవునా మామా”

“ఔ! మరి ఇప్పుడే మావాడు వూళ్ళోకి వెళ్ళొచ్చాడు”, చెప్పాడు వెంకటయ్య.
ఊరిని ఇతర ప్రాంతాలతో కలిపేది ఆ రహదారే. ఊరికి ఒకవైపు రహదారి. మరోవైపు ఏరు. రహదారికడ్డంగా వాగు. ఎంతో వాన వస్తే గాని ఆ వాగు అంతగా పొంగి పారదు. ఎగువ ప్రాంతంలో కురిసిన వాన నీళ్ళు కూడా ఆ వాగు ద్వారా ఏట్లో కలుస్తాయి.

ఆలోచిస్తూ తింటున్న ఈశ్వరయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వాన నీళ్ళు గడప మీదుగా గుడిసెలోకి ప్రవేశించాయి.

శివాలయం ఏటి గట్టుమీద కట్టిన పురాతన ఆలయం. విశ్వనాథశాస్ర్తీ ఆలయ అర్చకుడు. శివాలయంలో నిల్చున్న విశ్వనాథశాస్ర్తీ ఏటి వైపు తదేకంగా చూస్తున్నాడు. చూస్తుండగానే ఏట్లో నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే ఆలయంనుండి ఏట్లోకి దారితీసే మెట్లన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి. ఏ క్షణమైనా ప్రహరి గోడ దాటి నీళ్ళు ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడు చూడలేదు. చాలా ఆందోళనలో వున్నాడతను. ఆలయంలో పనిచేసే సహాయకులు కూడా వెళ్ళిపోయారు.

ఇంతలో ఆ వూరి బడి ప్రధానోపాధ్యాయుడు గుళ్ళోని విశ్వనాథశాస్ర్తీని చూసి ‘‘శాస్త్రులూ ఇంకా ఆలోచిస్తూ నిల్చున్నారేంటి, తొందరగా గుడి తలుపులు మూసి కుటుంబంతో సహా ఊరువదలండి. ఇప్పటికే సగం వూరు ఖాళీ అయ్యింది. ఆలస్యం చేస్తే ప్రమాదంలో పడతారు’’ అని హెచ్చరిస్తూ వేగంగా వెళ్ళిపోయాడు.

విశ్వనాథశాస్ర్తీ గర్భగుడిలోకి వెళ్ళి ‘‘పరమేశ్వరా ఏమిటీ స్థితి. కర్తవ్యం బోధపడడంలేదు. నిస్సహాయుడిని. నీవే దిక్కు తండ్రీ’’ అని వేడుకున్నాడు. శివార్చన చేసి హారతి ఇచ్చాడు. శివ నామస్మరణ చేసుకుంటూ గర్భగుడినుండి బయటకు వచ్చేసరికి నీరు ప్రహరిగోడ మీదుగా ఆలయంలోకి ప్రవేశించడం చూసి భయాందోళనకు గురయ్యాడు.
విశాలాక్షి భర్త ఆదేశానుసారం బట్టలు, అత్యవసరమైన వస్తువులు చేతి సంచుల్లో సర్దుతోంది. ‘‘ఏమేవ్! ఇంకా ఎంతసేపు సర్దుతావ్ కానీయ్. ఊళ్ళో మనమే మిగిలినట్టున్నాము. రహదారి కూడ మునిగిపోయిందంట. ఊరెలా దాటుతామో! అంతా ఆ శంకరుడిదే భారం’’ అన్నాడు విశ్వనాథశాస్ర్తీ.

ఈశ్వరయ్య తెప్ప నెత్తిమీద పెట్టుకొని బిరబిరా వాగువైపు నడుస్తున్నాడు. వెనక అతని పెళ్ళాం, కొడుకు అనుసరిస్తున్నారు. తెప్ప సాయంతో బేగిన వూరు దాటాలి అని మనస్సులో అనుకొన్నాడు.
విశ్వనాథశాస్ర్తీ తన కుటుంబంతో వాగు దగ్గరకి చేరుకొన్నాడు. వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రభుత్వం ఏమైనా ఏర్పాట్లుచేసిందేమోనని చుట్టూ పరికించాడు. అలాంటి జాడేమి కనిపించలేదు. చాలామంది ఊరి జనం అప్పటికే వాగు దాటి ఆవలి గట్టుపై వున్నారు. పైనుండి జోరుగా వర్షం పడుతూనే వుంది. వాగు దాటి ఏదో ఒక బండి ఎక్కి అక్కడికి ముప్ఫై మైళ్ళదూరంలో వున్న పట్టణాన్ని చేరాలి. కానీ ఎలా దాటడం అనుకుంటుండగా అవతలి గట్టు దగ్గర ఒక తెప్ప ఎవరినో దించి మళ్ళీ ఈ గట్టు దగ్గరకు వస్తూ వుండడం గమనించాడు. తెప్పమీద వున్న మనిషి అంత స్పష్టంగా కనపడడం లేదు. కొద్దిగా దగ్గరకు వచ్చేసరికి గుర్తుపట్టాడు విశ్వనాథశాస్ర్తీ.

ఈశ్వరయ్య వడివడిగా తెప్పను గట్టువైపు తీసుకురాసాగాడు.

ఇప్పుడు వీడి సాయం అర్థించాలా వద్దా అని సందిగ్దావస్తలో పడ్డాడు. ఈశ్వరయ్య గట్టువైపువస్తూ పెళ్ళాం, కొడుకును తెప్ప ఎక్కడానికి సమాయత్తం అవ్వమని చెప్పాడు. కాని ఇంతలో కొద్ది దూరంలో కుటుంబంతో సహా నిల్చున్న విశ్వనాథశాస్ర్తీని గమనించాడు.

మరో ఆలోచన చేయకుండా ‘‘సామి రండి వాగు దాటిస్తాను’’అని పిలిచాడు. విశ్వనాథశాస్ర్తీ తటపటాయిస్తూ భార్య పిల్లలవైపు చూశాడు. వాళ్ళు దీనంగా తెప్పలో వెళదాం అని అర్ధిస్తున్నట్టు అనిపించిందతనికి. ‘‘సామి బేగిరండి. ఆలోచిస్తూ వుంటె పనికాదు. ఇప్పుడే డాట్టరు బాబు వాళ్ళను దాటించి వత్తున్నాను. ఎక్కండి సామి మిమ్మల్ని కూడా దాటించొస్తాను’’. తప్పనిసరిగా తెప్పలోకి అడుగుపెట్టాడు విశ్వనాథశాస్ర్తీ. అందరూ ఎక్కిన తరువాత చూస్తే ఇక అక్కడ కాస్త కూడా చోటు మిగల్లేదు.

‘‘గంగి సాములోరిని వాగుదాటించొత్త, ఈడనే వుండండి’’ అన్నాడు ఈశ్వరయ్య.
‘‘అట్నేకాని’ అంది గంగాభవాని ‘‘బేగిరా అయ్యా! కొడుకన్నాడు’’. వాడి కళ్ళల్లోని భయాన్ని చూస్తూ ఇట్నే వచ్చేత్తాగా అంటూ తెప్పను ముందికి పోనిచ్చాడు. “చిన్న తెప్ప సామి” విశ్వనాథశాస్ర్తీని చూస్తూ చెప్పాడు.
విశ్వనాథశాస్ర్తీ తదేకంగా ఈశ్వరయ్యను చూస్తుండిపోయాడు. కళ్ళలోంచి నీళ్ళు ఉబికి వస్తున్నాయి. మనిషిలోంచి మనిషి మాయమవుతున్న ఈరోజుల్లో పరులకోసం తన కుటుంబాన్నే లెక్కచేయలేదంటే ఆ క్షణంలో ఈశ్వరయ్య, గంగాభవాని సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులుగా అగుపించారతనికి అంతే రెండు చేతిలెత్తి నమస్కారం చేశాడు. “అదేంటి సామి. మీరు నాకు దండం పెట్టడం ఏంటి సామి... కంట్లో నీరేంటి సామి ఏమైంది సామి” అడిగాడు ఈశ్వరయ్య.

“నన్ను క్షమించు ఈరయ్య” అని రెండు చేతులు జోడించి అర్థించాడు విశ్వనాథశాస్ర్తీ.

‘‘అదేంటి సామి అట్టా అంటారు. మీరు అట్టా మాట్లాడకూడదు సామి. మీరు బాగుంటేనే కదా ఆ దేముడికి అన్ని జరుగుతాయి. అప్పుడేకదా మాలాంటోరిని దేముడు చల్లంగా చూత్తాడు. మీరు బాగుండాలి సామి’’ అంటూ తెప్పను జాగ్రత్తగా ముందుకు తీసుకెళుతున్నాడు.

సరిగ్గా నెలరోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది విశ్వనాథశాస్ర్తీకి. ఇంటి తలుపులు దబదబా బాదుతుండడం విని ఈ సమయంలో ఎవరా అనుకొంటూ తలుపులు తీశాడు విశ్వనాథశాస్ర్తీ. ఎదురుగా నిల్చున్న వ్యక్తిని గుర్తుపట్టలేకపోయాడు. వెనక ఓ ఆడమనిషి కూడా వుండడం గమనించాడు. ‘ఎవరు కావాలి’ ప్రశ్నించాడు విశ్వనాథశాస్ర్తీ.

“నేను సామి ఈశ్వరయ్యను. అందరూ ఈశ్వరయ్య అంటుంటారు. చేపలు పట్టి అమ్ముకొనేవాణ్ణి సామి.”
“అయితే ఏంటి ఈ సమయంలో”.

“సామి నా కొడుక్కి చీకట్లో ఏదో పురుగు కుట్టింది. బాధతో అల్లాడుతున్నాడు. సమయానికి డాట్టరు బాబు కూడా లేడు. పక్కూరికి వెళ్ళాడంట. కాస్త చూడండి సామి” అంటూ చేతులు జోడించాడు.
విశ్వనాథశాస్ర్తీకి కాస్త నాటు వైద్యం కూడా తెలుసు.

“ఎక్కడున్నాడు?” అడిగాడు విశ్వనాథశాస్ర్తీ.

అక్కడే అరుగుమీద పడుకోబెట్టిన కొడుకును చూపాడు.

చూసిన వెంటనే చిర్రున కోపం వచ్చింది విశ్వనాథశాస్ర్తీకి ‘‘ఏయ్ ఎక్కడ పడుకోబెట్టేది. బుద్దివుందా నీకసలు. తీసుకెళ్ళి వీధిలో చెట్టుకింద వున్న అరుగుమీద పడుకోబెట్టు. కాసేపాగి వస్తాను” అంటూ అరిచాడు.
‘తప్పయింది సామి మన్నించు’అంటూ కొడుకుని భుజాన వేసుకొని వీధి వైపు పరుగెత్తాడు. ఈశ్వరయ్యను అనుసరించింది అతడి పెళ్ళాం గంగాభవాని.

వాళ్ళు వెళ్ళిన వెంటనే ఒక బిందెడు నీళ్ళు తెచ్చి అరుగుమీద గుమ్మరించాడు విశ్వనాథశాస్ర్తీ. తెల్లారే గుళ్ళో ప్రత్యేక పూజ వుంది. తొందరగా లేవాలి. మధ్యలో ఈ వెధవ సంత నిద్ర పాడుచేశాడు. తిట్టుకొంటూ నిదానంగా బయలుదేరాడు.
వీధి అరుగు దగ్గరకు చేరేటప్పటికి అక్కడ డాక్టరు ఉమాపతి వుండడం, ఈశ్వరయ్య కొడుక్కి సిరంజి ద్వారా మందు ఎక్కిస్తుండడం చూశాడు.

అమ్మయ్య వచ్చాడా! బ్రతికిపోయాను. లేకపోతే వైద్యం చేసేటప్పుడు వాణ్ణి తాకినందుకు మళ్ళీ సాన్నం చేయవలసి వచ్చేది అనుకొన్నాడు. విశ్వనాథశాస్ర్తీ వచ్చింది గమనించి ఈశ్వరయ్య “సామి డాట్టరు బాబు వచ్చాడు. యిరుగుడు మందిచ్చాడు. భయం లేదన్నాడు. చమించండి సామి. మీకు శమ ఇచ్చాను” అంటూ దండం పెట్టాడు.
సరేసరేనంటూ అక్కడినుంచి వెళ్ళాడు విశ్వనాథశాస్ర్తీ.

ఆరోజు జరిగిన సంఘటన అంతా విశ్వనాథశాస్ర్తీ కళ్ళముందు కదలాడింది. ఎంత నిర్దయగా ప్రవర్తించాను ఆరోజు. సాటి మనిషి ప్రాణంమీదకు వస్తే కాస్త కూడా కనికరం చూపించలేకపోయాను అనుకొంటూ మనసులోనే కుమిలాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో తన వాళ్ళకంటే నా కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చాడు. తనకోసం బ్రతికేవాడు మనిషైతే పరులకోసం బ్రతికేవాడు మహర్షి అని ఎక్కడో చదివినట్టు గుర్తొచ్చింది విశ్వనాథశాస్ర్తీకి. ఇప్పుడు ఈశ్వరయ్య మహర్షిలాగే అగుపించాడతనికి.

ఇవేమి పట్టని ఈశ్వరయ్య తెప్పను గట్టుదగ్గరకు చేర్చే ప్రయత్నంలో వున్నాడు. నేరుగా వాగుకు అడ్డంగా వెళ్తే ప్రవాహ ఉధృతిని తట్టుకోవడం కష్టమని తెప్పను ఎగువకు తీసికెళ్ళాడు. అక్కడైతే వాగు వెడల్పుగా వుండి ఉధృతి తక్కువగా వుంటుందని అలా చేశాడు.

విశ్వనాథశాస్ర్తీ నలుదిక్కులా ఓసారి చూశాడు. కనుచూపుమేర ఎటుచూసినా నీరే కనిపిస్తోంది. ఏమిటే ప్రకృతి విలయతాండవం. మానవుడు ఎంతో ప్రగతి సాధించాను. అన్నీ తన ఆధీనంలో వున్నాయి అని విర్రవీగుతుంటాడు. అలాంటప్పుడే ప్రకృతి నన్నేమి చేయలేవురా అని విరుచుకుపడుతుంది. ప్రకృతి దృష్టిలో అన్ని, ఒకటే అందరూ సమానమే. రాజు- పేద, పండితుడు- పామరుడు, గుడి- గుడిసె అన్న తేడా లేదు. కులము మతము అన్నవి లెక్కలోకి రావు. ఎంత ఆదరిస్తుందో కోపం వస్తే అన్నింటిని ముంచేస్తుంది. అందుకే మానవుడు ఎప్పుడు ప్రకృతి శక్తికి లోబడే వుండాలి. ప్రకృతిని ఆరాధించాలి, కాపాడుతూ వుండాలి. ఇలా ఎప్పుడు లేని, రాని ఆలోచనలు ముంచెత్తాయి విశ్వనాథశాస్ర్తీని.

‘‘సామి గట్టుదగ్గరకు వచ్చాము ఇక దిగండి’’అని ఈశ్వరయ్య అంటుండగా ఆలోచనలనుండి బయటకు వచ్చాడు. కుటుంబంతో సహా గట్టుమీదకు చేరాడు. చొక్కా జేబునుండి చేతికందిన డబ్బును తీసి ఈశ్వరయ్యకు అందివ్వబోయాడు. ‘ఏంటి సామి దుడ్లు ఎందుకు సామి. మీకాడ దుడ్లు తీసుకోకూడదు సామి’ అంటూ నిరాకరించాడు. “జాగ్రత్త సామి వుంటాను” అని తెప్పను మళ్ళించి తన పెళ్ళాం కొడుకు వున్న వైపు తీసికెళ్ళాడు.
ఎంత నిస్వార్థ జీవి. చిన్నపాటి వైద్యానికి కూడా డబ్బు తీసుకొనేవాడిని. ఇక ఎప్పుడూ తీసుకోకూడదనుకొన్నాడు విశ్వనాథశాస్ర్తీ.

వెళ్తున్న తెప్పను, ఈశ్వరయ్యను చూస్తూ వాడికి వాడి కుటుంబానికి ఏమవకూడదని తలచాడు. ప్రకృతిని నమ్మిన వాణ్ణి, ప్రకృతి మీదే ఆధారపడి బ్రతికేవాణ్ణి ఆ ప్రకృతిశక్తే కాపాడుతుంది. అయినా మనస్సులో వాళ్ళు క్షేమంగా వుండాలని తను రోజు పూజించే పరమేశ్వరుడ్ని వేడుకొన్నాడు. వాళ్ళేకాదు అందరూ బాగుండాలని కూడా ఆ దేవుణ్ణి కోరుకున్నాడు విశ్వనాథశాస్ర్తీ.

Thursday 1 September 2011

వినాయకచవితి శుభాకాంక్షలు

                                     బ్లాగులోకంలో విహరించే అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు.